ఈటీవీ విన్లో ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్తో ఒక్కసారిగా ఇండస్ట్రీని కుదిపేసిన దర్శకుడు ఆదిత్య హాసన్. మొదటి సిరీస్తోనే ఈయన సృష్టించిన సంచలనం మామూలుగా లేదు.. అలాంటి దర్శకుడి నుంచి వచ్చిన సినిమా ‘ఎపిక్: ది ఫస్ట్ సెమిస్టర్’. పైగా ‘బేబీ’ జంట నటించడంతో అంచనాలు మరింత పెరిగాయి.. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ను ఈ సినిమా రీచ్ అయిందా లేదా అనేది చూద్దాం..

కథ:
చదువు పూర్తయ్యాక ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న కుర్రాడు ఆదిత్య (ఆనంద్ దేవరకొండ). దాంతో ఇక్కడే ఉంటే ఎందుకు పనికి రాకుండా పోతాడని తండ్రి (శివాజీ) ఉన్నత చదువుల నిమిత్తం యుకేకు పంపుతాడు. అలా లండన్లో అడుగుపెట్టిన తొలిరోజే అతడికి కడలి (వైష్ణవి చైతన్య)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్తా చనువుగా మారి, ఇద్దరూ ఒకే గదిలో సహజీవనం చేస్తారు. కేవలం ఖర్చులు పంచుకోవడం.. అప్పుడప్పుడూ ఫిజికల్ నీడ్స్ కోసమే కలుద్దామని, ఎలాంటి ఎమోషన్స్ పెట్టుకోవద్దని కండిషన్ పెట్టుకుంటారు. కోర్సు పూర్తవ్వగానే ఎవరి దారిన వారు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఈ జంట.. సుమారు 10 నెలల తర్వాత ఒకరిపై ఒకరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళ ప్రయాణం ఎక్కడికి చేరింది..? కలిసున్నారా లేదంటే విడిపోయారా అనేది అసలు కథ..
స్క్రీన్ ప్లే:
90స్ వెబ్ సిరీస్ ద్వారా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటినుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కామన్ పాయింట్ను ఎంచుకున్నప్పటికీ.. దాన్ని వెండితెరపై ఆవిష్కరించే క్రమంలో ఆయన కొంత తడబాటుకు గురైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్టాఫ్ విషయానికి వస్తే ఎలాంటి గందరగోళం లేకుండా తాను అనుకున్న పాయింట్ను చాలా ధైర్యంగా, సూటిగా చెప్పే ప్రయత్నం చేశాడు. సెన్సార్ను సైతం లెక్కచేయకుండా నేటి తరం యువత ఆలోచనలను, వారి జీవనశైలిని చాలా ఓపెన్గా చూపించాడు. చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కుర్రాళ్లకు అక్కడి పరిస్థితులు ఎంత కొత్తగా ఉంటాయి, ఆ క్రమంలో ఎదురయ్యే అనుభవాలు ఎలా ఉంటాయనేది ఫస్టాఫ్లో చాలా వేగంగా చూపించారు. ఇక్కడివరకు ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టదు. కానీ అసలు చిక్కు సెకండాఫ్లోనే మొదలవుతుంది.

ఫస్టాఫ్లో ఉన్న వేగం, ఆసక్తి సెకండాఫ్లో పూర్తిగా లోపించాయి. ప్రధాన పాత్రలు ఒకే గదికే పరిమితం అవ్వడంతో, చూసే ప్రేక్షకుడికి కొంత ఊపిరాడనట్లు అనిపిస్తుంది. అసలు కథ ఎక్కడికి పోతుందో, దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో కూడా అర్థం కాలేదు. మరీ ముఖ్యంగా కథను ఒకే గదికి పరిమితం చేయడం కూడా నచ్చదు. క్లైమాక్స్కు ముందు వచ్చే సన్నివేశాలు మాత్రం మనసును హత్తుకుంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులతో మాట్లాడే ఫోన్ కాల్ ఎపిసోడ్, సొంత ఊరికి దూరంగా బతుకుతున్న ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. ఓవరాల్గా ఒక సాహసోపేతమైన పాయింట్ను చెప్పే ప్రయత్నంలో డైరెక్టర్ కొంతవరకు సక్సెస్ అయినా, స్క్రీన్ప్లే పరంగా ఇంకొంత కసరత్తు చేసి ఉంటే ఔట్ పుట్ మరో స్థాయిలో ఉండేది. నిజంగానే ఎపిక్ అయ్యుండేది.. కానీ ఇప్పుడు మాత్రం ఎటూ కాకుండి పోయింది.
నటీనటులు:
ఆనంద్ దేవరకొండ తన అమాయకత్వంతో తెర మీద చక్కగా ఒదిగిపోయాడు. మనోడి క్యారెక్టరైజేషన్ ఫన్నీగా అనిపిస్తుంది. ఇక వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. బేబీ చిత్రంతోనే సంచలనం సృష్టించిన ఈమె.. ఇందులో అంతకుమించిన ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఎంచుకోవడం నిజంగా సాహసమనే చెప్పాలి. ఆ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచింది. హీరో తల్లిదండ్రులుగా కనిపించిన శివాజీ, వాసుకి తమ పరిధి మేరకు అద్భుతంగా ఆకట్టుకున్నారు. కళ్యాణ్ శంకర్, శ్రీనివాస్ గవిరెడ్డి లాంటి వాళ్లు కూడా ఇతివృత్తానికి తగ్గట్లుగా తమ వంతు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:
హేషమ్ అబ్ధుల్ వహాబ్ అందించిన పాటలు బాగున్నాయి.. నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. అజీమ్ కెమెరా పనితనం విజువల్స్ను ఎంతో రిచ్గా చూపించింది. కూర్పు బాధ్యతలు చేపట్టిన నవీన్ నూలీ.. సెకండాఫ్లో కాస్త కఠువుగా కత్తెరకు పనిచెప్పి ఉంటే ఫలితం మరింత ఎంగేజింగ్గా ఉండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. అద్భుతమైన ఫ్యామిలీ సిరీస్ తీసిన డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడం ఆశ్చర్యపరిచినా, అనుకున్న పాయింట్ను తెరపై చూపించడంలో తికమకపడ్డాడు.
ఓవరాల్గా:
చివరగా చెప్పాలంటే ‘ఎపిక్’.. ఫస్టాఫ్ పీక్.. సెకండాఫ్ బాగా వీక్..!
