
రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఇరుముడి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద పాఠం నేర్పిందనే చెప్పాలి. ఒక సినిమా హిట్ అవ్వాలంటే పండగ సీజన్ కావాలి, టికెట్ రేట్లు పెంచాలి, సోలో రిలీజ్ దొరకాలి లాంటి ఎన్నో లెక్కలు వేసుకునే మేకర్స్ అందరికీ ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ టైమ్లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫెస్టివల్ అడ్వాంటేజ్ లేదు, సెలవులు లేవు. పైగా టికెట్ హైక్స్ అస్సలు లేవు. దీనికి తోడు కేజియఫ్ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా పోటీగా బరిలో ఉంది. వీటన్నింటికీ మించి రవితేజ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఈ సినిమాకు ముందు వరుసగా ఏకంగా అరడజన్ డిజాస్టర్స్ పడ్డాయి. ఆ ఫ్లాపుల దెబ్బకు రవితేజ మార్కెట్ పూర్తిగా పడిపోయింది అనుకున్న టైమ్ లో వచ్చిన ఇరుముడి ఏకంగా రికార్డులు తిరగరాస్తూ 230 కోట్లకు పైగా వసూలు చేసింది. నైజాంలోనే 60 కోట్ల షేర్ తెచ్చింది.. ఇంకా తెస్తుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా ఈ సినిమా థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది అంటే కచ్చితంగా ఇది టాలీవుడ్ దర్శక నిర్మాతలకు, హీరోలకు ఒక కనువిప్పు లాంటిదే. కథలో దమ్ముంటే టైమింగ్తో పనిలేకుండా జనం ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి నిరూపించింది.
అసలు ఇరుముడి సినిమాలో ఏముందని జనం అంతలా ఎగబడి చూస్తున్నారు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఒక సినిమా రెండు వారాలు థియేటర్లలో ఆడటమే గగనంగా మారిపోయిన ఈ రోజుల్లో, మూడో వారం కూడా ఇరుముడి హౌస్ ఫుల్ బోర్డులతో రన్ అవుతుందంటే అందులో జరిగిన మ్యాజిక్ ఏంటో మన డైరెక్టర్లు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మన హీరోలు, మేకర్స్ ఇంకా పాన్ ఇండియా అనే భ్రమలోనే బతుకుతూ కంటెంట్ మీద కంటే వందల కోట్ల బడ్జెట్, గ్రాండియర్ సెట్స్, భారీ విజువల్స్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. కానీ ఆడియన్స్కు కావాల్సింది ఆర్భాటాలు కాదు, మనసుకు హత్తుకునే ఒక అందమైన ఎమోషనల్ కథ అని ఇరుముడి స్పష్టం చేసింది. స్క్రీన్ మీద వందల కోట్లు తగలబెట్టినంత మాత్రాన జనం థియేటర్లకు క్యూ కట్టరు, ఆ కథలో ఫీల్ ఉండాలి, పాత్రల మధ్య కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉండాలి. ఇరుముడిలో ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అద్భుతంగా వర్కవుట్ అయింది. అందుకే టాక్సిక్ లాంటి వందల కోట్ల బడ్జెట్ సినిమాను సైతం పక్కనపెట్టి ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కంటెంట్తో కనెక్ట్ చేస్తే భాష, బడ్జెట్తో సంబంధం లేకుండా ఆడియన్స్ సినిమాను ఓన్ చేసుకుంటారని ఈ కలెక్షన్స్ నిరూపిస్తున్నాయి.
ఇక మన స్టార్ హీరోలు, పాన్ ఇండియా డైరెక్టర్లు నేర్చుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం మేకింగ్ టైమ్. ఒక్కో సినిమా కోసం ఏకంగా మూడు నాలుగేళ్లు టైమ్ తీసుకుంటూ అభిమానుల సహనాన్ని తీవ్రంగా పరీక్షిస్తున్నారు. సినిమా అంటే ఎప్పుడో ఒకసారి వచ్చే ఒలింపిక్స్ గేమ్స్ లాగా మారిపోయింది మన స్టార్ హీరోల పరిస్థితి. కానీ ప్రేక్షకులకు ఇవేవీ అవసరం లేదు. సరైన కథ, పక్కా స్క్రిప్ట్ తో వస్తే కేవలం ఆరు నెలల్లో సినిమా తీసి రిలీజ్ చేసినా మేము సూపర్ హిట్ చేస్తామని ఆడియన్స్ పదే పదే చెప్తున్నారు. ఇరుముడి విషయంలో జరిగింది కూడా ఇదే. సింపుల్ కథను ఎంచుకుని, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని చాలా తక్కువ టైమ్ లోనే సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అనవసరమైన హంగామా లేకుండా ఆడియన్స్కు ఏం కావాలో అది మాత్రమే ఇస్తూ కరెక్ట్ టైమ్కు సినిమాను డెలివరీ చేస్తే రిజల్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ మూవీ క్రియేట్ చేస్తున్న రికార్డులు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా మూడు నాలుగేళ్ల మేకింగ్ అనే పిచ్చి వదిలించుకుని హీరోలు స్పీడ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సినిమా గట్టిగా వార్నింగ్ ఇస్తోంది.

నిజానికి ఆడియన్స్ మైండ్ సెట్ మారిందనడానికి ఇరుముడి ఒక్కటే ఉదాహరణ కాదు. గత కొద్ది నెలలుగా బాక్సాఫీస్ దగ్గర జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో విడుదలై భారీ విజయాలు సాధించిన మా ఇంటి బంగారం, లెనిన్, కొరియన్ కనకరాజు, చెన్నై లవ్ స్టోరీ లాంటి సినిమాలు కూడా ఇదే విషయాన్ని ఘంటాపథంగా చెబుతున్నాయి. ఈ సినిమాల్లో ఏవీ పాన్ ఇండియా లెవెల్ బడ్జెట్ తో తీసినవి కావు, అలాగని భారీ యాక్షన్ ఎపిసోడ్స్, కళ్లు చెదిరే వీఎఫ్ఎక్స్ ఉన్న సినిమాలు కూడా కావు. ఇవన్నీ కేవలం బలమైన కథ, ఆకట్టుకునే కథనం, మనసుకు హత్తుకునే ఎమోషన్స్ బేస్ చేసుకుని వచ్చినవే. కంటెంట్ ఈజ్ కింగ్ అని ఆ సినిమాలు ప్రూవ్ చేస్తే, ఇరుముడి దాన్ని మరోసారి బలంగా కన్ఫర్మ్ చేసింది. ఆడియన్స్ కేవలం స్వచ్ఛమైన వినోదాన్ని, తమ జీవితాలకు దగ్గరగా ఉండే ఎమోషన్స్ను మాత్రమే కోరుకుంటున్నారు తప్ప ఆర్టిఫీషియల్ పాన్ ఇండియా ఎలివేషన్స్ను కాదని ఈ వరుస విజయాలు టాలీవుడ్కు గట్టిగా హింట్ ఇస్తున్నాయి. ఈ ట్రెండ్ను క్యాచ్ చేసిన వాళ్లే రేపటి రోజున ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్గా నిలబడతారు.
ఇన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందు కనిపిస్తున్న తర్వాత అయినా మన ఇండస్ట్రీలో, ముఖ్యంగా మన స్టార్ హీరోల ఆలోచనా విధానంలో మార్పు వస్తుందా అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. జనం మాకు ఫలానా తరహా సినిమాలే కావాలి అంటూ థియేటర్ల దగ్గర వసూళ్ల రూపంలో ఓటు వేసి మరీ చెబుతున్నారు. అనవసరమైన ఖర్చు తగ్గించి, రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఇండస్ట్రీ బాగుపడుతుంది. హీరోల మార్కెట్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. భారీ బడ్జెట్ సినిమాల పేరుతో నిర్మాతలు నిండా మునిగిపోతున్న ఈ రోజుల్లో, ఇలాంటి ఎమోషనల్ అండ్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు ఇండస్ట్రీకి ప్రాణవాయువు లాంటివి. తమ మార్కెట్ను కాపాడుకోవడానికి పక్కా కమర్షియల్ హంగులు వెతుక్కునే బదులు, ఆడియన్స్తో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే కథలు ఎంచుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. మరి ఆడియన్స్ ఇస్తున్న ఈ క్లియర్ మెసేజ్ను టాలీవుడ్ డైరెక్టర్లు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, మన హీరోలు ఏ మేరకు రియలైజ్ అయి మనసుకు నచ్చే కథల వైపు అడుగులు వేస్తారు అన్నది వేచి చూడాలి. ఏదేమైనా రవితేజ ఇరుముడి సక్సెస్ మాత్రం రాబోయే రోజుల్లో టాలీవుడ్ సినిమా మేకింగ్ స్టైల్పై కచ్చితంగా ఒక బలమైన ప్రభావాన్ని చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
